జగన్‌ సర్కార్‌కు అంతిమ ఘడియలు వచ్చాయి: లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటు సీఐడీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శలు చేశారు

By Srikanth Gundamalla  Published on  8 April 2024 11:10 AM GMT
nara lokesh, comments,  andhra pradesh, government, cid,

 జగన్‌ సర్కార్‌కు అంతిమ ఘడియలు వచ్చాయి: లోకేశ్ 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటు సీఐడీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శలు చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు. జగన్‌ పుణ్యమా అని సీఐడీ క్రైమ్‌ ఇన్వాల్వ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌గా మారిపోయిందని లోకేశ్ విమర్శించారు. తాము ఎప్పటి నుంచో చెబుతున్న మాటలు ఇప్పుడు నిజం అయ్యాయని ఎక్స్‌లో రాసుకొచ్చారు. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్‌లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడారంటూ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఉన్న పోలీస్‌ సర్వీస్‌ (జేపీఎస్‌)గా మారిందని లోకేశ్ అన్నారు. ఐపీఎస్‌లు ఇంతగా బరితెగించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం అని నారా లోకేశ్ అన్నారు. మా కుటుంబంపై బురద జల్లేందుకు భారీ కుట్ర జరిగిందని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ డీఐజీ రఘురామిరడ్డి మా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారని అన్నారు. అధికారం పోతుందని తెలిసే పత్రాలు దహనం చేశారని లోకేశ్ అన్నారు. పత్రాలు తగులబెడితే పాపాలు పోతాయా అని ప్రశ్నించారు. జగన్‌ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని అన్నారు. చేసిన నేరానికి మూల్యం చెల్లించుకోక తప్పదని నారా లోకేశ్‌ ఎక్స్‌ వేదిక పోస్టు పెట్టారు.

తాడేపల్లి సిట్‌ కార్యాలయం కాంపౌండ్‌లో పలు పత్రాలను సిబ్బంది దహనం చేశారు. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక పత్రాల దహనంపై సీఐడీ స్పందించింది. ఐదు కేసుల్లో విజయవాడ సీఐడీ కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశామని అన్నారు. ఒక్కో అభియోగపత్రంలో 8వేల నుంచి 10 వేల పీజీలు ఉన్నాయని సీఐడీ తెలిపింది. ఫొటోకాపీ మెషీన్‌ వేడెక్కడంతో కొన్ని పేపర్లు అస్పష్టంగా ప్రింట్‌ అయినట్లు వివరించింది. అలాంటి వాటిని దహనం చేస్తుంటామని, కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ కోర్టుకు సమర్పించామని తెలిపింది.


Next Story