వైఎస్‌ జగన్‌ విమర్శలు.. మంత్రి లోకేష్‌ మాస్‌ కౌంటర్‌

టెన్త్‌ పరీక్షల నిర్వహణలో ఫెయిలయ్యారంటూ వైసీపీ చీఫ్‌ వైఎస్‌ జగన్‌ చేసిన విమర్శలపై మంత్రి నారా లోకేష్‌ స్పందించారు.

By అంజి
Published on : 1 Jun 2025 8:32 AM IST

Minister Nara Lokesh, YS Jagan, Tenth exams,APnews

వైఎస్‌ జగన్‌ విమర్శలు.. మంత్రి లోకేష్‌ మాస్‌ కౌంటర్‌

అమరావతి: టెన్త్‌ పరీక్షల నిర్వహణలో ఫెయిలయ్యారంటూ వైసీపీ చీఫ్‌ వైఎస్‌ జగన్‌ చేసిన విమర్శలపై మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. 'ప్రజా జీవితం, వ్యక్తిగత జీవతంలో ఫెయిల్‌ అయిన జగన్‌ ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలి. చిన్నప్పుడే టెన్త్‌ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పే. ఎస్‌ఎస్‌సీ మూల్యాంకనంలో రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ ఎప్పటి నుంచో ఉంది. మీ హయాంలోనూ తప్పులు జరిగాయి. ఆ వివరాలను బయటకుపెట్టే ధైర్యం మీరు చేయడం లేదు'' అని మండిపడ్డారు.

''జగన్‌ ప్రజా జీవితంలో, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్‌ అయ్యారు. ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలను రద్దుచేసిన మీరూ మాట్లాడుతున్నారా?. అధికారంలో ఉన్నప్పుడు టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టిన మీరు ఇప్పటికీ వారి పట్ల కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు. మీరు తీసుకొచ్చిన జీవో 117 వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. టీచర్లను, విద్యార్థులను సన్నద్ధం చేయకుండానే సీబీఎ్‌సఈ తీసుకొచ్చారు. నేను మంత్రి కాగానే వారికి పరీక్ష నిర్వహించగా 90శాతం మంది ఫెయిల్‌ అయ్యారు.

వారి భవిష్యత్తు కోసం సీబీఎస్‌ఈని వాయిదా వేశాం. ఐబీ తీసుకొచ్చినట్టు కలలు కంటున్నారు. వాస్తవానికి మీరు తీసుకొచ్చింది ఐబీ సిలబస్‌ కాదు. ఐబీ అమలుకు రిపోర్ట్‌ కోసం రూ.5 కోట్లు ఖర్చు చేశారు అంతే. ఇక టోఫెల్‌ బోధించే టీచర్లు లేకపోయినా టోఫెల్‌ తెచ్చినట్లు జబ్బలు చరుచుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రూ.4,500 కోట్లు, గుడ్లు, చిక్కీలకు రూ.వెయ్యి కోట్లు బకాయిలు పెట్టిపోయారు. మీ హయాంలో టీచర్ల బదిలీలకు మంత్రి డబ్బులు వసూలు చేశారన్నది బహిరంగ రహస్యం. మీరు భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నా. రాజకీయాలకు అతీతంగా టీచర్ల బదిలీలు చేస్తున్నాం'' అని పేర్కొన్నారు.

అంతకుముందు చంద్రబాబు, లోకేష్‌ టెన్త్‌ పరీక్షల నిర్వహణలో ఫెయిల్‌ అయ్యారని మాజీ సీఎం జగన్‌ విమర్శించారు. 'మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారు. ప్రతి స్టూడెంట్‌ మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్‌ చేయండి. తుది ఫలితాలు వచ్చేంత వరకు టెన్త్‌ మార్కులు ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను నిలిపివేయండి' అని డిమాండ్‌ చేశారు.

Next Story