అమరావతి: ఎస్టీటీల బదిలీల విషయంలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. వెబ్ కౌన్సెలింగ్బదులు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్టు ట్వీట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు తనకు తెలియజేశారని తెలిపారు. అంతకుముందు కూడా ఉద్యోగ సంఘాలు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరాయి. వెబ్ కౌన్సిలింగ్ వల్ల ఉపాధ్యాయులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపాయి.
''పార్వతీపురం మన్యం జిల్లాలో నా క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం ప్రజా ప్రతినిధులు, టిడిపి ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్లతో ఎస్జీటీ కౌన్సిలింగ్పై చర్చించాం. ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు నాకు తెలియజేశారు. వారి విజ్ఞప్తి మేరకు ఎస్జీటీలకు ఆన్ లైన్ కౌన్సిలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించాం'' అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఎస్జీటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.