అమరావతి: రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు రాగులు కూడా ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలి విడతగా రాయలసీమలోని 8 జిల్లాల్లో వచ్చే నెల నుంచి వీటిని సరఫరా చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఒడిశా నుంచి 16,500 మెట్రిక్ టన్నుల రాగులు కొనుగోలు చేసినట్టు తెలిపారు. అటు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు రేషన్ సరుకుల పంపిణీలో నిర్లక్ష్యం చేయొద్దని డీలర్లకు సూచించారు. ఒకవేళ సర్వర్ సమస్య ఎదురైతే.. రేషన్ కార్డులు ఉన్నవారికి సరుకుల పంపిణీని ఎక్కడా ఆపొద్దని సూచించారు. అవసరం అనుకుంటే లబ్ధిదారుడి ఫోటో తీసుకుని, సంతకం చేయించుకుని నిత్యవసరాలు ఇవ్వాలని ఆదేశించారు.
అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తామని, ఇందుకోసం 25 కిలోల రైస్ బ్యాగులు సిద్ధం చేస్తున్నామన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా రేపటి నుంచి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్లో సన్న బియ్యంతో భోజనం పెడతామని చెప్పారు మంత్రి. పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్ విద్యార్థులకు ఇకపై రుచికరమైన భోజనం అందుతుందన్నారు.