ఏపీ స్పోర్ట్స్ హబ్‌కు చేయూతనివ్వండి..మాండవీయకు లోకేశ్ రిక్వెస్ట్

ఏపీ మంత్రి లోకేశ్ కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో సమావేశం అయ్యారు

By Knakam Karthik
Published on : 19 Jun 2025 11:00 AM IST

Andrapradesh, Ap Minister Nara Lokesh, Union Sports Minister Mansukh Mandaviya

ఏపీ స్పోర్ట్స్ హబ్‌కు చేయూతనివ్వండి..మాండవీయకు లోకేశ్ రిక్వెస్ట్

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలో మంత్రి లోకేశ్ కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో సమావేశం అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్రమంత్రిని కోరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... అమరావతిలో రాజధాని నిర్మాణపనులు శరవేగంగా కొనసాగుతున్నాయి, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. క్రీడల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ప్రపంచస్థాయి శిక్షణ, సౌకర్యాలను కల్పించడం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వివిధ క్రీడావిభాగాల్లో అథ్లెట్లకు మద్దతు నివ్వడం స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యం..అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ను స్పోర్ట్స్ హబ్ గా మార్చడానికి సహకారం అందించండి. రాష్ట్రంలోని పాఠశాలలు, గ్రామ స్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి చేయూత నందించండి. కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గుంటూరు సమీపాన నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, కాకినాడ డిస్టిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్ లో హాకీ, షూటింగ్ లకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ఏర్పాటు చేయండి. ఖేలో ఇండియా పథకంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 39 ప్రాజెక్టులకు సంబంధించి రూ.341.57 కోట్లతో ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు త్వరితగతిన ఆమోదం తెలపండి. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) రీజనల్ సెంటర్ ను ఏర్పాటుచేయండి. ఖేలో ఇండియాలో భాగంగా అథ్లెటిక్స్, రెజ్లింగ్ స్టేట్ లెవల్ సెంటర్ ను తిరుపతిలో నెలకొల్పండి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లాస్థాయి ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటుచేయండి. దేశవ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రైల్వే స్పోర్ట్స్ కన్సెషన్ పాస్ లను మంజూరు చేయండి, ఏపీలో ఈఎస్ఐ హాస్పిటల్స్ అభివృద్ధికి సహకరించాలని లోకేష్ విజ్ఞప్తిచేశారు. కేంద్రమంత్రి మాండవీయ స్పందిస్తూ... ఏపిని స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తాం, ఈఎస్ఐ హాస్పిటల్స్ సేవలను మరింత విస్తృత పరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయకు అందజేశారు.

Next Story