అమరావతి: వైఎస్ జగన్కు మంత్రి నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఉర్సా కంపెనీకి విశాఖలో ఎకరం భూమి రూ.1 కే ఇచ్చారనే ఆరోపణలను జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని లోకేష్ స్పష్టం చేశారు. ఒక వేళ మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు అని అన్నారు. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డికి కొత్తేమీ కాదని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారు అంటూ జగన్ తీవ్ర ఆరోపణ చేశారని, తాను స్పష్టంగా మరోసారి చెబుతున్నా.. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటి పార్క్ హిల్ - 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించాం అని చెప్పారు.
కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించామన్నారు. బురదజల్లి ప్యాలస్ లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండి అంటూ మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. ఛాలెంజ్ కు సిద్ధమా జగన్ రెడ్డి? మీ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారని లోకేష్ ఫైర్ అయ్యారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని తెలిపారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతున్నామని, కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారని, ఈనో వాడండి కాస్త రిలీఫ్ వస్తుందని సెటైర్ వేశారు.