ప్రతి సంవత్సరం డీఎస్సీ..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik
ప్రతి సంవత్సరం డీఎస్సీ..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
అమరావతి: టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రచరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించి, విజయవంతంగా నిర్వహించాం. ఇకపై ప్రతిఏటా డీఎస్సీ ప్రకటించి ఖాళీలను భర్తీచేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖపై రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. అనవసరమైన శిక్షణా కార్యక్రమాలతో ఉపాధ్యాయుల విలువైన సమయాన్ని వృధా చేయవద్దు. ప్రభుత్వ విద్యలో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు గత 14నెలలుగా సమర్థవంతంగా సంస్కరణలు అమలుచేశాం, సంస్కరణల అంతిమ లక్ష్యం అభ్యసన ఫలితాలే. మెరుగైన ఫలితాలపై దృష్టిసారించాల్సిన బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. అసర్ నివేదిక ప్రకారం ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రోగ్రామ్ అమలులో జాతీయస్థాయిలో రాష్ట్రం 14వస్థానంలో ఉంది, ఈ పరిస్థితిలో మార్పు రావాలి. మెరుగైన ర్యాంక్ సాధించేందుకు నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలి. దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రతి బిడ్డకు గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఒక హక్కుగా ఇవ్వబోతున్నాం. ఉపాధ్యాయుల సహకారంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి బిడ్డకి గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అందించడమే లక్ష్యంగా పనిచేద్దాం అని మంత్రి అన్నారు.