మాజీ సీఎం జగన్ ఐ ప్యాక్ డ్రామాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ప్రజలు నడి రోడ్డు మీద నిలబెట్టినా ఆయనలో ఇంకా మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం గుంటూరు మిర్చి యార్డులో రాద్ధాంతం చేశారని.. అధికారంలో ఉండగా జగన్ చేసిన తప్పులను ప్రశ్నిస్తామనే భయంతోనే అసెంబ్లీకి రావడం లేదని దుయ్యబట్టారు. పోలీసులను బెదిరించి నీచ రాజకీయాలకు జగన్ తెర లేపారని మండిపడ్డారు.
మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు మాట్లాడారు అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎన్నికల కోడ్ ఉందని అధికారులు చెప్పినా.. రాజకీయ స్వార్థానికే జగన్ మిర్చి యార్డ్కు వెళ్లారు. పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా నిలబెట్టి, ఐ ప్యాక్ చేత జగన్ చేస్తోన్న డ్రామాలను ప్రజలు ఛీ కొడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.
దళిత సోదరుడిని కిడ్నాప్ చేస్తే కేసులు పెట్టరా? అంటూ వల్లభనేని వంశీని అరెస్టును ఉద్దేశించి మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. నేరస్థులను మాజీ సీఎం జగన్ వెనకేసుకురావడం దారుణమని ఆరోపించారు. అసలు జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు.