ఏపీలో ఆక్వా రైతులకు తీపికబురు..లైసెన్స్ పొందడం మరింత సులభం
రాష్ట్ర ఆక్వాకల్చర్ రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో నిలుపుతామని వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు
By Knakam Karthik
ఏపీలో ఆక్వా రైతులకు తీపికబురు..లైసెన్స్ పొందడం మరింత సులభం
రాష్ట్ర ఆక్వాకల్చర్ రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో నిలుపుతామని వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. రాష్ట్రంలోని మత్స్య సంపద, ఉత్పత్తి నాణ్యత, ఎగుమతి అవకాశాలు, మరియు రైతుల ఆదాయాన్ని పెంచే విధానాలపై సమగ్రంగా అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో అక్వాకల్చర్ అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మత్స్యశాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ అనుకూల పద్ధతులు, శాస్త్రీయ విధానాల వినియోగం ద్వారా ఉత్పత్తి పెంపుతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ స్థాయిని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఇకపై రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థ చట్టం కింద తమ ఆక్వా చెరువులను ఆన్లైన్లో సులభంగా నమోదు చేసుకోవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ విధానం ద్వారా లైసెన్స్ పొందే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని అన్నారు. ప్రభుత్వ ప్రయోజన పథకాలు పొందడానికి ప్రతి ఆక్వాకల్చర్ రైతు తమ చెరువులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. సముద్ర ఆహార ఎగుమతుల నాణ్యతను, ట్రేసబిలిటీని మెరుగుపరచడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు. డి-పట్టా, అసైన్, సీజెఎఫ్ఎస్ భూములపై చేపల పెంపకం చేస్తున్న రైతులకు ఆక్వా అభివృద్ధి సంస్థ చట్టం ప్రకారం సాగు ధ్రువీకరణ పత్రం ఇవ్వబడుతుందని తెలిపారు. దీని ద్వారా వారు ప్రభుత్వ పథకాలు మరియు ఆర్థిక సహాయం పొందే అవకాశం కలుగుతుందని తెలియజేశారు.
కొన్ని ప్రాంతాల్లో పౌల్ట్రీ వ్యర్థాలను చేపల ఆహారంగా వాడుతున్నట్లు గుర్తించామని మంత్రి అన్నారు. ఇది ప్రజారోగ్యానికి హానికరంతో పాటు నీటి కాలుష్యం కావడంతో ఈ ప్రక్రియను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రైతులు వెంటనే ఈ విధానాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. చెరువుల యజమానులు చికెన్ వ్యర్థాలను చేపల ఆహారంగా వేసినట్లు రుజువైతే వెంటనే వారి లైసెన్సులను రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.