ఏపీ రాజధాని అంశంపై మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజధాని అంశంపై మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం రాజధానిగా త్వరలోనే ఏర్పడుతుందన్నారు.
By అంజి Published on 13 March 2023 1:45 PM IST
ఏపీ రాజధాని అంశంపై మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజధాని అంశంపై మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం రాజధానిగా త్వరలోనే ఏర్పడుతుందన్నారు. విశాఖ రాజధాని చేయాలని గొప్ప పాలసీని సీఎం జగన్ తీసుకొచ్చారన్నారు. స్థానిక సంస్థలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హాక్కును వినియోగించుకున్న అనంతరం మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడారు. ఈ క్రమంలోనే విపక్ష పార్టీపై ఫైర్ అయ్యారు. ప్రతిపక్షం దొంగ దిబ్బతీయాలనే కులాల పేరుతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్దిగా ఇండిపెండెంట్ను బరిలో ఉంచారని అన్నారు.
చంద్రబాబుకు.. కులాలను ఎగదోయడం, పార్టీల వెనకుండి అసమానతలను రెచ్చగొట్టడం వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి అప్పలరాజు ఆరోపించారు. ఈ ఎన్నికలతో అయినా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్కు సపోర్ట్ చేయాలని గ్రాడ్యుయేట్స్ని కోరారు. వారి వర్గం వారు బాగుపడాలనే లక్ష్యంతో అమరావతి కేపిటల్ సిటీ కావాలంటూ టీడీపీ కోర్టుకు వెళ్లిందని మండిపడ్డారు. చంద్రబాబు వైఖరిని ప్రజలను గమనించాలని అన్నారు.
టీడీపీ గెలవడానికి పోటీచేయడం లేదని, వైసీపీ అభ్యర్థిని ఓడించాలని కుమ్మక్కు రాజకీయాలకు తెరతీసిందన్నారు. ఇతర పార్టీలతో టీడీపీ కుమ్మక్కయిందని ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికలు వస్తే నక్కలమారి వేషాలు వేస్తారని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. జిల్లాలో పొలింగ్ ఉత్సాహంగా కొనసాగుతుందన్న మంత్రి అప్పలరాజు.. వైసిపి శ్రేణులు ఓటర్లను ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు గ్రామాల నుంచి తరలిస్తున్నారని తెలిపారు. కాగా ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.