కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం కేసులో వేమూరి కావేరి ట్రావెల్స్ డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ2గా ఉన్న బస్సు యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన రమేష్ అనే ప్రయాణికుడి ఫిర్యాదుతో ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి 10 నిమిషాల ముందు అటుగా వెళ్లిన 35 మంది డ్రైవర్లను ప్రశ్నించి.. లక్ష్మయ్య నిర్లక్ష్యమూ ప్రమాదానికి కారణమని గుర్తించి అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా 35 వాహనాల డ్రైవర్లను పోలీసులు విచారించారు. బైక్ రోడ్డుపై పడిపోయిందని చెప్పారు.
రోడ్డుపై నిర్జీవంగా పడిపోయిన ఓ వ్యక్తిని మరో వ్యక్తి పక్కకు లాగుతున్నట్లు చూశామని కొందరు డ్రైవర్లు పోలీసులకు తెలిపారు. ఆ సమయంలో వాహనం ఆపితే ఏదైనా సమస్య వస్తుందని, అలాగే తమ యజమానులు తిడతారన్న భయంతో వెళ్లిపోయామని వివరించినట్లు తెలిసింది. ఒక్కరైనా మానవతా ధృక్పథంతో స్పందించి ఆ బైక్ను పక్కకు నెట్టేసి ఉంటే ఘోర ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యే వారు కాదు. బస్సు డ్రైవర్ లక్ష్మయ్య అరెస్టును పోలీసులు మంగళవారం చూపించారు. వైద్య చికిత్సల అనంతరం, కోర్టులో హాజరు పరిచి, రిమాండ్కు తరలించారు.
కాగా ఈ ఘోర ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. వీరిలో 18 మంది మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ఆధారంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఓ గుర్తు తెలియని మృతదేహం కోసం చిత్తూరు జిల్లా నుంచి ఒకరు వచ్చారని ఎస్పీ విక్రాంత్ తెలిపారు. తన తండ్రి కనిపించడం లేదని ఆ వ్యక్తి చెప్పినట్టు వివరించారు. డీఎన్ఏ ఆధారంగా ఆ డెడ్బాడీ ఎవరిదన్నది తేలుతుందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ మద్యం తాగలేదని పేర్కొన్నారు.