మహానాడుకు సిద్ధమైన కడప..ఏర్పాట్లు పూర్తి

కడప జిల్లా చరిత్రలో తొలిసారి తెలుగుదేశం పార్టీ మహానాడుకు వేదికైంది

By Knakam Karthik
Published on : 26 May 2025 9:04 AM IST

Andrapradesh, Kadapa District, TDP Mahanadu, Chandrababu Naidu

మహానాడుకు సిద్ధమైన కడప..ఏర్పాట్లు పూర్తి

కడప జిల్లా చరిత్రలో తొలిసారి తెలుగుదేశం పార్టీ మహానాడుకు వేదికైంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా పూర్తయ్యాయి. కడప నగరం మొత్తం పసుపు తోరణాలు, పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయి, పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. రేపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడపకు రానుండటంతో మిగిలిన పనులు కూడా నూటికి నూరు శాతం పూర్తవుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

మహానాడు ఏర్పాట్లపై టీడీపీ సీనియర్ నేత, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి మాట్లాడుతూ దాదాపు 20 కమిటీలు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. సుమారు యాభై వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని, వారికి తగ్గట్టుగా సభా ప్రాంగణం, భోజన వసతులు సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ మహానాడును "స్వచ్ఛ మహానాడు"గా, "జీరో వేస్ట్ ఈవెంట్"గా నిర్వహిస్తున్నామని, పర్యావరణ హితమైన వస్తువులనే వాడుతున్నామని తెలిపారు.

మహానాడులో చర్చించాల్సిన తీర్మానాలపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టం, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత బలోపేతం, యువతకు, మహిళలకు ప్రాధాన్యం వంటి అంశాలపై ప్రధానంగా తీర్మానాలు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధి, కడప జిల్లాకు సంబంధించిన ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వంటి అంశాలపై కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి. గతంలో రాయలసీమ అభివృద్ధికి పాటుపడింది తెలుగుదేశం పార్టీయేనని, ఈసారీ ఈ ప్రాంత అభివృద్ధికి పెద్దపీట వేస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story