అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ రమేశ్ చే న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. గతంలో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తూ జస్టిస్ రమేశ్ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. మరలా ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తిగా తిరిగి బదిలీ కావడంతో ఆయనతో చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,హైకోర్టు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ, అదనపు అడ్వకేట్ జనరల్ ఐ సాంబశివ ప్రతాప్, రిజిస్ట్రార్ జనరల్ వైవిఎస్బిజి పార్ధసారధి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.చిదంబరం, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్.ద్వారకానాధ్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, పలువురు రిజిస్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.