టీవీ డిబేట్‌లో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు..సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్

అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Knakam Karthik
Published on : 9 Jun 2025 12:33 PM IST

Andraprades, Amaravati, Kommineni Srinivas Rao, AP Police, Defamatory Comments, Tullur Police Station

టీవీ డిబేట్‌లో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు..సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్

రాజధాని అమరావతి ప్రాంతంలో వేశ్యలు ఉన్నారంటూ రెండు రోజుల క్రితం ఓ టీవీ డిబేట్‌లో చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. కొమ్మినేనిని ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిపై సాక్షి టీవీ చర్చలో మహిళలను అవమానించారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ క్రమంలోనే మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టులు కొమ్మినేనితో పాటు కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై ఎన్టీఆర్‌ జిల్లా తెలుగు మహిళలు, రాజధాని రైతులు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంభంపాటి శిరీష శనివారం రాత్రి గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై ఐటీ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం, ఇతర నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టేందుకు కట్టుదిట్టమైన భద్రత నడుమ కొమ్మినేనిని విజయవాడకు తరలిస్తున్నారు.

Next Story