రుయాలో అంబులెన్స్ డ్రైవర్ల దందా.. కుమారుడి మృత‌దేహంతో బైక్‌పై 90 కి.మీ

Inhuman incident at Ruia Hospital body of a child moved in a two wheeler.ఇటీవ‌ల కాలంలో అంబులెన్స్ డ్రైవ‌ర్ల ఆగ‌డాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 April 2022 7:43 AM GMT
రుయాలో అంబులెన్స్ డ్రైవర్ల దందా.. కుమారుడి మృత‌దేహంతో బైక్‌పై 90 కి.మీ

ఇటీవ‌ల కాలంలో అంబులెన్స్ డ్రైవ‌ర్ల ఆగ‌డాలు మితిమీరిపోతున్నాయి. తాము అడిగినంత ఇస్తేనే వ‌స్తాం అంటూ పేద‌లను పీడిస్తున్నారు. కొడుకు చ‌నిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తండ్రి.. అంబులెన్స్ డ్రైవ‌ర్ల నిర్వాకం మ‌రింత కులిపోయేలా చేశాయి. చేసేది లేక త‌న కుమారుడి మృత‌దేహాన్ని ద్విచ‌క్ర‌వాహ‌నంపైనే స్వ‌గ్రామానికి తీసుకువెళ్లాడు.

వివ‌రాల్లోకి వెళితే.. అన్న‌మ‌య్య జిల్లా చిట్వేలికి చెందిన జైశ్వ అనే బాలుడు కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో అత‌డి త‌ల్లిదండ్రులు అత‌డిని రుయా ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చారు. చికిత్స పొందుతూ కిడ్నీ, కాలేయం పూర్తిగా ప‌నిచేయ‌క‌పోవ‌డంతో బాలుడు నిన్న రాత్రి 11 గంట‌ల స‌మయంలో మృతి చెందాడు. కొడుకు మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లేందుకు బాలుడి తండ్రి అంబులెన్స్ డ్రైవ‌ర్ల‌ను అడుగ‌గా.. 90 కిలోమీట‌ర్ల దూరానికి రూ.10వేలు డిమాండ్ చేశారు. అంత మొత్తం భ‌రించలేని ఆ తండ్రి విష‌యాన్ని స్వ‌గ్రామంలో ఉన్న త‌న మిత్రుల‌కు తెలుప‌గా.. వారు ఉచిత అంబులెన్స్‌ను రుయా ఆస్ప‌త్రికి పంపారు.

అయితే.. ఆస్ప‌త్రికి వచ్చిన ఉచిత అంబులెన్సు డ్రైవర్ ను రుయా ఆసుపత్రి వద్ద మాఫియాగా ఏర్పడిన అంబులెన్స్ డ్రైవర్లు కొట్టి.. అత‌డిని అక్కడి నుంచి పంపించేశారు. తమ అంబులెన్సుల్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ ప‌ట్టుబ‌ట్టారు. దీంతో చేసేది లేక ఆ బాలుడి తండ్రి ద్విచ‌క్ర‌వాహ‌నంపైనే కుమారుడి మృత‌దేహాన్ని స్వ‌గ్రామానికి తీసుకువెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రోజు రోజుకు అంబులెన్స్ డ్రైవ‌ర్ల ఆగ‌డాలు పెరిగిపోతున్నాయ‌ని మండిప‌డుతున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎందుకీ దుస్థితి?

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ''మొన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం. నేడు మరో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రైవేట్ అంబులెన్స్ దందా కారణంగా అమానవీయ ఘటన. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? చేతగాని పాలకుడు వైఎస్‌ జ‌గన్ గారి చెత్త పాలన కారణంగా అనారోగ్యంతో చనిపోయిన కొడుకు మృతదేహాన్ని తండ్రి 90 కి.మీ. బైక్ పై తీసుకెళ్లి అంత్యక్రియలు చెయ్యాల్సిన దుస్థితి. తిరుపతి రుయా ఆసుప‌త్రి నుంచి బాలుడు జేసవా మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ కావాలని వేడుకున్నా కనికరం చూపలేదు.ప్రైవేట్ అంబులెన్స్ ల ధరలు తట్టుకోలేక బైక్ పైనే రాజంపేట జిల్లాలోని చిట్వేలుకు 90 కి.మీ. మేర బాలుడి మృతదేహాన్ని తరలించారు ఆ తండ్రి. గత తెలుగుదేశం ప్రభుత్వం పార్థివ దేహాన్ని ఉచితంగా తరలించే మహాప్రస్థానం రవాణా వాహనాలను ఏర్పాటు చేసింది.వైసీపీ ప్రభుత్వం మహాప్రస్థానం వాహనాలను నిర్వీర్యం చెయ్యడం కారణంగానే ప్రైవేట్ అంబులెన్స్ దందా పెరిగి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సీఎం గారు నిద్రలేచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగుపర్చాలి'' అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

Next Story