విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దేవస్థానంలో గత 18 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.3.35 కోట్లుగా నమోదైంది. బుధవారం జరిపిన లెక్కింపులో నగదుతో పాటు 302 గ్రాముల బంగారం, 3.010 కిలోల వెండిని భక్తులు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. సగటున రోజుకు రూ.18.65 లక్షల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.
అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి సుమారు 14 దేశాల విదేశీ కరెన్సీ కూడా లభించడం అమ్మవారిపై భక్తులకు ఉన్న విశ్వాసాన్ని చాటిచెబుతోంది. మరోవైపు, భక్తుల సౌకర్యార్థం దుర్గాఘాట్ వద్ద ఏర్పాట్లను ఈఓ సీనా నాయక్ పరిశీలించారు. రద్దీని తగ్గించేందుకు వీలుగా సబ్వేల అభివృద్ధి, కొత్త మార్గాల ఏర్పాటుపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు.