కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

Iconic bridge on Krishna river.. Center green flag for construction. కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1,082.56 కోట్లతో తెలుగు రాష్ట్రాల

By అంజి  Published on  14 Oct 2022 5:44 AM GMT
కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1,082.56 కోట్లతో తెలుగు రాష్ట్రాల మధ్య ఈ వంతెనను నిర్మించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఐకానిక్‌ బ్రిడ్జ్‌ ఫొటోలను షేర్‌ చేశారు. ఇదిలా ఉండగా, దేశంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న కేబుల్ మరియు సస్పెన్షన్ ఐకానిక్ వంతెన ఇదే. ఈ వంతెన నిర్మాణాన్ని 30 నెలల్లో పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. వంతెనకు గోపురం ఆకారంలో పైలాన్, లైటింగ్ వ్యవస్థ ఉంటుందని తెలిపారు.

నల్లమల అడవులు, ఎత్తైన కొండలు, శ్రీశైలం రిజర్వాయర్‌తో కూడిన ప్రాంతంలో ఈ వంతెన నిర్మిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఈ వంతెన నిర్మాణంతో 15 ఏళ్ల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరనుంది. తెలంగాణలోని కొల్లాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లాలంటే కృష్ణా నదిలో పడవలో ప్రయాణించాలి. ప్రమాదమని తెలిసినా ఏమీ చేయని పరిస్థితి అక్కడి ప్రజలది. అయితే రోడ్డు మార్గంలో రావాలంటే వంద కిలోమీటర్లు ప్రయాణించాలి.

2007లో కృష్ణా నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. నదిపై వంతెన నిర్మించాలని అప్పటి నుంచి ప్రజలు కోరుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి కడప, చిత్తూరు, తిరుపతి వైపు వెళ్లే వారు కర్నూలు మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. హైదరాబాద్-తిరుపతి మధ్య దూరం 80 కి.మీ తగ్గుతుంది.

Next Story