మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్కి వ్యతిరేకంగా తాను తిరుపతిలో, వైజాగ్ లో మాట్టాడినట్లు కొన్ని ఊరూ పేరూ లేని పత్రికలు, టీవీ చానళ్ళు చేస్తున్న ప్రచారం తన దృష్టికి వచ్చిందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. జగన్కు వ్యతిరేకంగా ఆఫ్ రికార్డ్ గానీ, ఆన్ రికార్డు గానీ తాను ఎక్కడా మాట్లాడలేదన్నారు. వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్ల, విభేదించి పార్టీ వదిలానే కానీ, జగన్కు హాని కలిగే విధంగా ప్రవర్తించడం, మాట్లాడడం జరగదన్నారు.
''నేను రాజకీయాల్లో లేను. ఏ రాజకీయ పార్టీతో లేదా ఏ నాయకుడితో నాకు శతృత్వం లేదు. నేను ఏ విషయం మాట్లాడదలచుకున్నా మీడియా ముందు నేరుగా నిస్సంకోచంగా మాట్లాడతా. లేదా నా అధికారిక 'ఎక్స్' ద్వారా తెలియజేస్తా. తెరవెనుక బాగోతాలు, నటనలు, ప్రస్తావనలు ఉండవు. నా పేరిట అవాస్తవాలు ప్రచారం చేయటానికి ఉబలాటపడుతున్న వారు నల్ల కోట్లు వేసుకుని ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తున్న ప్రచారాలను, చెత్త పత్రికల్లో రాస్తున్న రాతలను నమ్మవద్దని కోరుతున్నాను'' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.