కృష్ణా జిల్లాలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై రాష్ట్ర హోం మంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ, వెంటనే స్పందించిన మంత్రి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఎస్ఐ దుర్గాంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా సహా ఇతర సిబ్బందికి తక్షణం మెరుగైన వైద్య చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడలోని ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వైద్యం అందించాలని అధికారులను సూచించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఘటనకు సంబంధించి సమగ్ర నివేదికను సేకరించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.