'2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం'.. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం హైలైట్స్

2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నట్టు గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగించారు.

By అంజి  Published on  24 Feb 2025 1:23 PM IST
AP Governor Abdul Nazir, Assembly, APNews

'2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం'.. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం హైలైట్స్

2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నట్టు గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగించారు. పెన్షన్లు రూ.4 వేలకు పెంచామన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నామన్నారు. పోలవరంను పట్టాలెక్కించామని చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిందని, ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్‌ దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందన్నారు. రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగేలని మెజారిటీ ఇచ్చారని అన్నారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని, గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. సూపర్‌ -6 పథకాలతో మేలు చేస్తున్నామని, అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేశామన్నారు. మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం చేశామని, అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నామని గవర్నర్‌ చెప్పారు.

''కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. మా ప్రభుత్వంలో తలసరి ఆదాయం పెరిగింది. అవకాశాలిస్తే ప్రతిఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని నమ్ముతున్నాం. ఏపీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ప్రతినెల ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తున్నాం. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, విద్య, వైద్యం మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాం. బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం. స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం'' అని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఉండాలనేది తమ ఆకాంక్ష అని తెలిపారు.

''పేదరికం నిర్మూనలకు వినూత్న విధానంతో ముందుకెళుతున్నాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు పీ4 నినాదాన్ని అనుసరిస్తున్నాం. విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాం. తల్లికి వందనం పథకాన్ని తీసుకువస్తున్నాం. తల్లి దండ్రులకు పిల్లల చదువులు భారం కాకుండా తల్లికి వందనం ఉంటుంది. తొలిసారిగా స్కిల్‌ సెన్సెన్స్‌ నిర్వహిస్తున్నాం. ప్రతి ఇంటికి ఓ వ్యాపారవేత్త ఉండాలనేది మా లక్ష్యం. విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని గవర్నర్‌ తెలిపారు.

గత ఐదేళ్లలో ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పోలవరంతో లింక్‌ చేస్తున్నామని చెప్పారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుతో రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పనులు వేగంగా సాగుతున్నాయని, వెలిగొండ ప్రాజెక్టు 75 శాతం పూర్తైందని తెలిపారు. ఏ రైతుకు సాగునీటి ఇబ్బందులు ఉండకూడదని, ఎకరం భూమి కూడా నిరుపయోగంగా ఉండకూడదని.. వ్యవసాయం రైతులకు మరింత లాభదాయకండా మారేలా చర్యలు చేపట్టామన్నారు. భూగర్భ జలాలను పెంచేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

4,300 కిలోమీటర్ల సీసీ రోడ్లను మంజూరు చేశామని గవర్నర్‌ తెలిపారు. గుంతలులేని రోడ్ల నిర్మాణంలో అద్భుతమైన పురోగతి సాధించామన్నారు. 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాల సృష్టిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. 2025-26లో విద్యుత్‌ ఛార్జీల పెరుగుదల ఉండదని చెప్పారు. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్‌టాప్‌ సోలార్ ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేలా వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్‌ చేపట్టినట్టు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ తెలిపారు.

Next Story