ఏపీకి భారీ వర్ష సూచన, ఈ నెల 29 వరకు వానలు
ఆంధ్రప్రదేశ్కు నాలుగు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
By Knakam Karthik
ఏపీకి భారీ వర్ష సూచన, ఈ నెల 29 వరకు వానలు
ఆంధ్రప్రదేశ్కు నాలుగు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీవర్షాల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ హోర్డింగులు, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి వద్ద నిలబడవద్దని తెలిపారు.
నేడు శ్రీకాకుళం,విజయనగరం,పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శుక్రవారం (జూన్ 27) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు.