అనంతపురం జిల్లాలో బంగారు నిక్షేపాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే

Gold mines in Anantapur Dist.అనంతపురం జిల్లా.. ఈ ప్రాంతం పేరు గురించి చెబితే చాలు కరువు గురించే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Sep 2021 7:25 AM GMT
అనంతపురం జిల్లాలో బంగారు నిక్షేపాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే

అనంతపురం జిల్లా.. ఈ ప్రాంతం పేరు గురించి చెబితే చాలు కరువు గురించే మాట్లాడుకుంటాం. కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు వజ్రాలు దొరికిన ఘటనల గురించి వింటూ ఉన్నాం. ఇప్పుడు ఏకంగా భారీ బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో 16 టన్నుల వరకు బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించిన ఖనిజాన్వేషణ విభాగం కాంపోజిట్ లైసెన్స్ జారీకి రెడీ అవుతోంది. జిల్లాలోని రామగిరిలో గతంలో భారత్ గోల్డ్‌మైన్స్ లిమిటెడ్ (బీజీఎంఎల్) గనులు ఉండగా, 2001 నుంచి అక్కడ తవ్వకాలు నిలిపివేశారు. ఇప్పుడు ఈ మైన్స్‌కు సమీపంలో రెండు చోట్ల, రొద్దం మండలం బొక్సంపల్లిలో రెండు చోట్ల, కదిరి మండలంలోని జౌకుల పరిధిలో ఆరు చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. ఈ పది ప్రాంతాల్లో 97.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో బంగారు నిక్షేపాలు ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో 50 మీటర్ల నుంచి దిగువకు వెళ్లే కొద్దీ బంగారు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు.

టన్నుమట్టిలో నాలుగు గ్రాములు ఉంటుందని, జౌకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 10 టన్నులు, రామగిరిలో నాలుగు టన్నులు, బొక్సంపల్లిలో రెండు టన్నులు కలిపి మొత్తంగా 16 టన్నుల నిల్వలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఖనిజాల అన్వేషణ కోసం కాంపోజిట్ లైసెన్స్ ఇవ్వనున్నారు. ఒక్కో వ్యక్తి లేదంటే సంస్థకు వెయ్యి హెక్టార్ల వరకు అన్వేషించుకునేందుకు లైసెన్స్ ఇస్తారు. పూర్తిస్థాయిలో నిక్షేపాలు గుర్తిస్తే మైనింగ్ లీజు కేటాయిస్తారు. త్వరలోనే ఇందుకు ఈ-వేలం నిర్వహించనున్నారు. ఈ వార్త అనంతపురం వాసుల్లో ఆనందాన్ని నింపుతోంది. లైసెన్స్ ఎవరికి దక్కుతుందా అనే ఆసక్తి కూడా ప్రజల్లో ఉంది.

Next Story