GIS 2023: రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు: మంత్రి గుడివాడ
ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలున్నాయన్నారు.
By అంజి Published on 3 March 2023 11:27 AM IST
రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు: మంత్రి గుడివాడ
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోలహాలంగా ప్రారంభమైంది. సీఎం జగన్, ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, నవీన్ జిందాల్, జీఎం రావు, జీఎంఆర్, సంజీవ్ బజాజ్ సహా పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రెండ్రోజుల పాటు జరిగే సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. జ్యోతిని వెలిగించిన సీఎం జగన్ సదస్సును ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం సీఎస్ జవహర్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు.
ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలున్నాయన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని, సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్ పాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ సారథ్యంలో బలమైన నాయకత్వం ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పటిష్ఠంగా ఉందని పేర్కొన్నారు.
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు రాష్ట్రంలో కొదవలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో సహజ వనరులు కూడా పుష్కలంగా ఉన్నాయన్నారు. పలు రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయని, పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. బిజినెస్ ఇండస్ట్రీలపై సీఎం జగన్ మంచి దార్శనికతతో ఉన్నారని, ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు రాష్ట్రంలో మంచి వాతావరణం ఉందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఇండియా ఇండస్ట్రియల్ మ్యాప్లో దూసుకుపోతోందన్నారు.
కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి 14 మంది రాయబారులు పాల్గొంటారు.
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ వేదికపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద కళాకారులు తమ కార్యక్రమాలను ప్రదర్శించారు.
అంతకుముందు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశిష్ట అతిథులను విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల వద్ద సాంప్రదాయ శైలిలో స్వీకరించారు.
ఆంధ్రా యూనివర్సిటీలోని సువిశాల క్రీడా మైదానంలో దాదాపు 200 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసేందుకు ముప్పై స్టాల్స్ను ఏర్పాటు చేశారు.
వేదిక ఐదు భారీ హాళ్లను కలిగి ఉంది. ఒక్కొక్కరు ఒక్కో ఈవెంట్ని నిర్వహిస్తారు. ప్రభుత్వం నుండి వ్యాపారం (G2B) సమావేశాలు, సెమినార్లు, ఇతర సమావేశాలు అన్నీ వరుసలో ఉన్నాయి. భారతదేశం, చైనా, యూఎస్ఏ, సహా 40 ఇతర దేశాల నుండి 8,000 మంది ప్రముఖులు, పెట్టుబడిదారులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.