వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ సబ్ జైలు నుంచి కంకిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి ఇప్పటికే నూజివీడు కోర్టు వంశీని కస్టడీకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులోనే వంశీని 2 రోజులపాటు కోర్టు అనుమతితో విచారించనున్నారు పోలిసులు.
కాగా ఈ కేసులో పూర్తి వివరాలతో పాటు సాక్ష్యాలను రాబట్టేందుకు వంశీని ఏడు రోజుల కస్టడీకి అనుమతించాలని ఈ నెల 19వ తేదీన హనుమాన్ జంక్షన్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్పై ఈ నెల 20న విచారణ చేపట్టిన నూజివీడు సెకండ్ అడిషనల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఇరు పక్షాల వాదనలు విని వల్లభనేని వంశీని 2 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసి.. వంశీని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా వల్లభనేని వంశీకి కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికే వల్లభనేని వంశీ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.