తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరిగిన ప్రత్యేక సమావేశానికి 50 మంది సభ్యులు హాజరు కావాల్సి ఉండగా కేవలం 22 మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్నికల నిబంధనల ప్రకారం, ఓటింగ్ ప్రక్రియ కొనసాగడానికి కనీసం 50% మంది సభ్యులు అవసరం. “కోరం పూర్తికాకపోవడంతో, ఎన్నికలను రేపటికి వాయిదా వేస్తున్నట్లు” అధికారులు తెలిపారు.
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో హైడ్రామా నెలకొంది. ఉదయం 11 గంటలకు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెలెక్ట్ హాల్లో ఎన్నికల ప్రక్రియ జరగాల్సి ఉండగా వైసీపీ కార్పొరేటర్ల దగ్గరకు కూటమి నేతలు వెళ్ళడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి నుంచి మునికృష్ణను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించగా, వైసీపీ చివరి నిమిషంలో లడ్డు భాస్కర్ను రంగంలోకి దించింది. తిరుపతిలో గత కొన్ని రోజులుగా క్యాంపు రాజకీయాల నడుమ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాస్తవానికి సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అది కాస్తా మంగళవారానికి వాయిదా పడింది.