ఇదో గేమ్ ఛేంజర్, ఫాస్టాగ్ వార్షిక పాస్‌పై ఏపీ డిప్యూటీ సీఎం హర్షం

ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ల వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు.

By Knakam Karthik
Published on : 18 Jun 2025 4:24 PM IST

Andrapradesh, Deputy CM Pawan Kalyan, FASTag annual passes, FASTag users, Union Minister Gadkari

ఇదో గేమ్ ఛేంజర్, ఫాస్టాగ్ వార్షిక పాస్‌పై ఏపీ డిప్యూటీ సీఎం హర్షం

నేషనల్ హైవేలపై ప్రయాణించే వారికి ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ల వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీసుకున్న ఈ నిర్ణయం, భారత రహదారి మౌలిక సదుపాయాల ప్రస్థానంలో ఒక గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ 'ఎక్స్' వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఫాస్టాగ్ వార్షిక పాస్‌లను ప్రవేశపెట్టాలన్న ప్రయాణికుల చిరకాల డిమాండ్‌కు ఈ నిర్ణయంతో సరైన పరిష్కారం లభించిందని పవన్ పేర్కొన్నారు. టోల్ చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడం ద్వారా ప్రైవేటు వాహన యజమానులకు ఈ కొత్త విధానం ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

"రూ.3000 వార్షిక పాస్‌తో వాహనదారులకు ఆర్థికంగా ఉపశమనం కలగడమే కాకుండా, దేశవ్యాప్తంగా సున్నితమైన, వేగవంతమైన, ఎలాంటి వివాదాలకు తావులేని విధంగా హైవే ప్రయాణం సాధ్యమవుతుంది" అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా టోల్ ప్లాజాల సమీపంలో నివసిస్తూ, తరచూ ప్రయాణించే వారికి ఈ విధానం వల్ల సమయంతో పాటు ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వానికి ప్రజాపాలన పట్ల ఉన్న నిబద్ధతకు నితిన్ గడ్కరీ తీసుకున్న ఈ నిర్ణయం ఒక నిదర్శనమని పవన్ కొనియాడారు.

Next Story