ఏలూరు ఘటనపై సీఎం జగన్‌ ఆరా

CM Jagan Inquires about eluru incident.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వంద మందికిపైగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో

By సుభాష్  Published on  6 Dec 2020 4:35 AM GMT
ఏలూరు ఘటనపై సీఎం జగన్‌ ఆరా

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వంద మందికిపైగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆరా తీస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానిలతో ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఒకే సారి అంత మంది అస్వస్థకు గురికావడం గల కారణాలను అడిగి తెలుసకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య బృందం, జిల్లా యంత్రాంగం, అధికారుల పనితీరును సీఎం జగన్‌ అభినందించారు. రాత్రంతా మేల్కొని ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకున్న మంత్రి ఆళ్లనాని పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

కాగా, వివిధ లక్షణాలతో అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. వ్యాధి లక్షణాలను పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు విజయవాడ నుంచి ప్రత్యేక వైద్య బృందాలను ఏలూరుకు పంపిస్తున్నామని, ఎలాంటి భయాందోళన చెందవద్దని సీఎం అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైతే మెరుగైన వైద్య సదుపాయం కల్పించడం కోసం అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. కాగా, ప్రత్యేక వైద్య బృందాలు ఉదయం ఏలురుకు వస్తున్నాయి. అక్కడి పరిస్థితులను పరిశీలన చేస్తారు. ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుంది అని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు.

Next Story