మత్స్యకార కుటుంబాలకు శుభవార్త.. నిధులు విడుదల చేసిన సీఎం జగన్

ఓఎన్జీసీ పైపులైన్‌ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు సీఎం జగన్ వర్చువల్‌గా డబ్బులు విడుదల చేశారు.

By అంజి  Published on  21 Nov 2023 6:41 AM GMT
CM Jagan, fishermen families, APnews, YCP Govt

మత్స్యకార కుటుంబాలకు శుభవార్త.. నిధులు విడుదల చేసిన సీఎం జగన్

ఓఎన్జీసీ పైపులైన్‌ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు సీఎం జగన్ వర్చువల్‌గా డబ్బులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో జరుపుకోవాలని అనుకున్నామని, అయితే వర్షాల తాకిడి వల్ల అక్కడికి చేరుకొనే పరిస్థితి లేక పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇవ్వాలనుకున్న, చేయాలనుకున్న ఆర్థిక సాయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైపు లైన్ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులందరికీ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అలాగే తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద పులికాట్ సరస్సు ముఖద్వారాన్ని పూడిక తీసి, తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకున్నామని, ఆ కార్యక్రమం వీలునుబట్టి ఈ నెలాఖరులోనో, వచ్చే నెలలోనో చేపడతామని సీఎం జగన్‌ అన్నారు.

ఓఎన్జీసీ పైపులైన్ నిర్మాణం వల్ల, జరుగుతున్న తవ్వకాల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 16,408 మంది మత్స్యకారుల కుటుంబాలకు, కాకినాడ జిల్లాలో మరో 7 వేల 50 మంది, మొత్తంగా 23,458 మంది మత్స్యకారుల కుటుంబాలకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. నెలకు రూ.11,500 చొప్పున చెల్లించే ఈ కార్యక్రమం గురించి ఓఎన్జీసీతో మాట్లాడామన్నారు. వారి తరఫున ఓఎన్జీసీతో మాట్లాడి 3 దశల్లో రూ.323 కోట్లు నష్టపరిహారం ఇప్పటికే ఇప్పించామన్నారు. 4వ విడత ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రూ.161 కోట్లు పరిహారం ఈరోజు ఇక్కడి నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం జరుగుతోందన్నారు.

నాలుగో విడతలో రూ.161 కోట్లు కలుపుకుంటే రూ.485 కోట్లు పరిహారంగా 23,458 కుటుంబాలకు ఇవ్వగలిగామని అన్నారు. ఇంతకుముందు 2012లో జీఎస్‌పీసీ అప్పట్లో ఇదే రకమైన కార్యక్రమం చేసి నష్టపోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు నష్టం జరిగిందని సీఎం జగన్‌ అన్నారు. కోనసీమ జిల్లా ముమ్మడివరంలో రూ.78 కోట్లు ఇవ్వాల్సి ఉంటే అప్పటి నుంచి మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా ఇవ్వని పరిస్థితి అని, తమ ప్రభుత్వం కన్నా ముందు చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు పరిపాలన చేసినా కూడా కనీసం ఇది ఇప్పించాలి, కానీ చేయలేదని అన్నారు.

మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనసు పెట్టి వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఫస్ట్ మనం ఇచ్చేసి తర్వాత ఈ డబ్బును కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వెనక్కు ఇప్పించుకోగలిగామని అన్నారు. ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుందన్న సీఎం జగన్‌.. మంచి చేయాలనే తపన ఉంటే దేవుడి సహకారం ఉంటుందన్నారు. ఎంతగా ప్రభుత్వం స్పందిస్తూ అడుగులు ముందుకు వేస్తోందన్నది నిన్న విశాఖపట్నంలో జరిగిన ఘటనే ఉదాహరణ అని అన్నారు. 40 బోట్లు కాలిపోయాయని మన దృష్టికి వస్తే ఆదుకోవాలని తపన పడ్డామన్నారు.

ఇన్సూరెన్స్ లేదని తెలిసిన వెంటనే మత్స్యకార కుటుంబాలకు మంచి జరగాలని బోటు విలువ లెక్కగట్టమని చెప్పి 80 శాతం ప్రభుత్వమే ఇచ్చేట్టుగా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని సీఎం జగన్‌ తెలిపారు. ఆ చెక్కులు ఈరోజే పంపిణీ చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించామన్నారు. ప్రతి విషయంలో మనసుపెట్టి అన్ని రకాలుగా మత్స్యాకారులకు తోడుగా ఉండే ప్రభుత్వం తమదన్నారు. ఓఎన్జీసీ అధికారులందరికీ మనస్పూర్తిగా తన తరఫున, ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Next Story