సూపర్ సిక్స్‌ను ఎగతాళి చేశారు.. కానీ సూపర్ హిట్ చేశాం..

ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పేదల సేవలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

By -  Medi Samrat
Published on : 1 Dec 2025 2:53 PM IST

సూపర్ సిక్స్‌ను ఎగతాళి చేశారు.. కానీ సూపర్ హిట్ చేశాం..

ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పేదల సేవలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని ప్రజలను కోరితే అంతా కలిసి అనూహ్యమైన మద్ధతు ఇచ్చారు. 164 సీట్లలో కూటమి అభ్యర్ధులను గెలిపించి మా బాధ్యతను పెంచారన్నారు. సూపర్ సిక్స్ ను కొందరు ఎగతాళి చేశారు. కానీ ప్రజల మద్దతుతో దానిని సూపర్ హిట్ చేసి చూపామ‌న్నారు. 18 నెలల్లో ఒక్క పెన్షన్ల కోసమే రూ. 50,763 కోట్లను ఖర్చు పెట్టాం.. దేశంలో ఎవరూ ఈ స్థాయిలో సంక్షేమం ఇవ్వడం లేదన్నారు. పొరుగు రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ, గుజరాత్ ఈ స్థాయిలో సంక్షేమం చేయటం లేదన్నారు. ఏడాదికి రూ.33 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. 1.65 లక్షల కోట్ల మేర వ్యయం చేస్తున్నామ‌న్నారు. ప్రతీ నెలా 63 లక్షల పైచిలుకు మందికి వివిధ కేటగిరీల్లో పెన్షన్లు ఇస్తున్నాం.. పెన్షన్లలో 59 శాతం మహిళలకే ఇస్తున్నాం.. అసలు పెన్షన్లు ప్రారంభించిందే ఎన్టీఆర్.. దానిని పెంచింది కూడా మా ప్రభుత్వమేన‌న్నారు.

గత పాలకులు ముక్కుతూ మూలుగుతూ రూ.250 చొప్పున మాత్రమే పెంచారు. ఒకేసారి రూ.4 వేల పెన్షన్ ప్రకటించి అమలు చేసింది కూటమి ప్రభుత్వమేన‌న్నారు. తల్లికి వందనం కింద ప్రతీ విద్యార్ధికీ రూ.15 వేల చొప్పున ఆర్ధిక సాయం తల్లుల ఖాతాలో వేశామ‌న్నారు. జనాభా సమతౌల్యం కోసం మనం ఆలోచన చేయాలి. అప్పుడే దేశం, రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తాయన్నారు. ఆడబిడ్డలు కష్టపడకుండా ఉండాలనే 3 ఉచిత గ్యాస్ సిలెండర్లను ప్రభుత్వం ఇస్తోందన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన 5-6 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తున్నామ‌ని తెలిపారు. స్త్రీ శక్తి ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికైనా వెళ్లేలా సదుపాయం కల్పించాం.. ఇప్పటి వరకూ 25 కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారు.. రూ.855 కోట్ల మేర ఆర్టీసీకి చెల్లించామ‌ని వెల్ల‌డించారు. 16,347 మందికి డీఎస్సీ ఉద్యోగాలు కల్పించాం.. అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతీ రైతుకూ రూ.20 వేలు ఇస్తున్నాం.. ఇప్పటికే రూ.14 వేల రూపాయల్ని పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాలకు జమ చేశాం.. పంచ సూత్రాల ఆధారంగా వ్యవసాయాన్ని లాభసాటి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.. దానికి అనుగుణంగా ప్రభుత్వం కార్యాచరణ కూడా చేపట్టింది.. ప్రతీ రైతునూ కలిసి అవగాహన కల్పిస్తున్నాం..త్వరలోనే చింతలపూడి లిఫ్ట్ ను కూడా పూర్తి చేసి రైతులకు నీళ్లు అందిస్తామ‌ని పేర్కొన్నారు.

Next Story