మదనపల్లె సబ్కలెక్టర్ ఆఫీస్లో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సీరియస్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబ సీరియస్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 22 July 2024 12:34 PM IST
మదనపల్లె కలెక్టర్ ఆఫీస్లో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సీరియస్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబ సీరియస్ అయ్యారు. తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన ప్రమాదంపై ఆరా తీశారు. అగ్నిప్రమాదంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయిన్లు ప్రాథమిక సమాచారం. అసైన్డ్, 22ఏ, కోర్టు కేసుల ఫైల్స్, భూముల సర్వే ఫైల్స్ కూడా కాలిపోయాయని తెలిసింది.
అగ్నిప్రమాదంపై జిల్లా కలెక్టర్తో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. రాత్రి 11.24 గంటలకు ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రికి జిల్లా అధికారులు వివరించారు. ఒక ఉద్యోగి ఆదివారం రాత్రి 10.30 గంటల వరకు ఆఫీసులోనే ఉన్నట్లు తెలిసింది. ఆదివారం ప్రభుత్వ ఉద్యోగి ఆ సమయం వరకు ఉండటానికి కారణాలు తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అతను ఎందుకు వెళ్లాడు.? ఆ సమయంలో అక్కడేం చేస్తున్నాడు? అనే వివరాలను సేకరించాలని ఆదేశించారు.
అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారా అని చంద్రబాబు ఆరా తీశారు. ఉదయం నుంచి చేసిన విచారణ గురించి పోలీసు ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యం చేయకూడదని అన్నారు. ఘటన సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైనా విచారణ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులు ఆదేశించారు. ఇక సీసీ ఫుటేజ్ను వెంటనే స్వాధీనం చేసుకుని.. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న ఎవరున్నారనేదానిపై దర్యాప్తు కొనాగించాలన్నారు. నేరాలు చేసి సాక్ష్యాలను మాయం చేసిన ఘనులు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారంటూ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అధికారులు కూడా కొందరు ఉన్నారనీ.. ఈ కోణంలోనూ దర్యాప్తు చేయాలని చెప్పారు. ప్రతి విషయంపై ఆరా తీసి నివేదికను తన ముందుంచాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మదనపల్లెకకు తక్షణమే డీజీపీ, సీఐడీ చీఫ్ వెళ్లాలని చెప్పారు.