సదరం సర్టిఫికెట్ల పునః పరిశీలనలో ఏ ఒక్క దివ్యాంగుడికీ అన్యాయం జరగకూడదని, నకిలీ పెన్షన్లు మాత్రమే తొలగించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా దివ్యాంగుల పెన్షన్, హెల్త్ పెన్షన్ పొందేవారికి కూడా ఎప్పటిలా నెల నెలా పెన్షన్ అందించాలని స్పష్టం చేశారు. వారికి పంపించిన నోటీసులు సైతం వెనక్కి తీసుకోవాలని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిన్న సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తీసుకుని వికలాంగ పెన్షన్ పొందుతున్నవారిపై ఇటీవల జరిపిన పున:పరిశీలన వివరాలను అధికారులు సీఎం ముందుంచారు. ప్రత్యేక వైద్య బృందాలను నియమించి సదరం సర్టిఫికెట్ల పున:పరిశీలన జరిపినట్లు తెలిపారు. అర్హులైన వారిలో ఒక్కరికి కూడా అన్యాయం జరగరాదని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా దివ్యాంగుల పెన్షన్, హెల్త్ పెన్షన్ పొందేవారికి కూడా ఎప్పటిలా నెలనెలా పింఛన్ అందించాలని సీఎం స్పష్టం చేశారు. వారికి పంపించిన నోటీసులు సైతం వెనక్కి తీసుకోవాలని చెప్పారు.