రూ.38 కోట్ల సీఎంఆర్ఎఫ్ ఫైల్పై చంద్రబాబు సంతకం
పేదలకు సాయంపై ఉగాది పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
By అంజి
రూ.38 కోట్ల సీఎంఆర్ఎఫ్ ఫైల్పై చంద్రబాబు సంతకం
పేదలకు సాయంపై ఉగాది పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.38 కోట్ల సీఎం సహాయనిధి ఫైల్పై సంతకం చేశారు. దీని ద్వారా 3,456 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.281 కోట్లు విడుదల య్యాయి. మరో వైపు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు.. 86 మందికి కళారత్న, 116 మందికి ఉగాది అవార్డులు ప్రదానం చేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. జీరో పావర్టీ సాధించగలిగితే తన జన్మ సార్థకం అవుతుందని అన్నారు. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు పీ4 విధానం తీసుకొస్తున్నట్టు చెప్పారు.
సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారని, వారు తిరిగి సమాజానికి ఇవ్వాలని కోరారు. 20 ఏళ్ల క్రితమే ఐటీ ప్రాముఖ్యత చెప్పానని, తన మాట విని ఐటీ వైపు వెళ్లిన వారు మంచి పొజిషన్లో ఉన్నారని అన్నారు. అధికంగా డబ్బులు సంపాదించే తెలివి ఉన్నవాళ్లు భారతీయులని సీఎం వివరించారు. తమ పాలనలో 'ప్రజలే ముందు' అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేస్తున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో కళ తప్పిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అనేక సమస్యలు సృష్టించిందని విమర్శించారు. ఒక్కో చిక్కుముడిని వదిలించుకుంటున్నట్టు తెలిపారు. పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.