గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ-అమరావతి డిక్లరేషన్.. విడుదల చేసిన సీఎం చంద్రబాబు
గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ-అమరావతి డిక్లరేషన్ను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
By అంజి
గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ-అమరావతి డిక్లరేషన్.. విడుదల చేసిన సీఎం చంద్రబాబు
అమరావతి: గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ-అమరావతి డిక్లరేషన్ను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ.. సీఎం క్యాంపు కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్, నెడ్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు సమక్షంలో గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ విడుదల చేశారు. ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్పై రెండు రోజుల పాటు సమ్మిట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమ్మిట్లో పాల్గొన్న 600 మంది ప్రతినిధులు, ఇండస్ట్రీ రంగ నిపుణులు పాల్గొన్నారు. ఏడు సెషన్లుగా జరిగిన సమ్మిట్లో గ్రీన్ హైడ్రోజన్ కంపెనీల సీఈఓలు, సీఓఓలు, ఎండిలు పాల్గొన్నారు.
రెండు రోజుల పాటు జరిగిన సమ్మిట్లో చర్చించిన అంశాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్ ప్రకటించింది. భారత్లో స్వచ్ఛమైన ఇంధనాల ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ మాన్యుఫ్యాక్చరింగ్కు విధివిధానాలు రూపొందించేలా డిక్లరేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలాని, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోనే అతిపెద్ద ఎకో సిస్టంను రాష్ట్రంలో నెలకొల్పటమే ఉద్దేశ్యం అని డిక్లరేషన్లో పేర్కొంది.
2027 నాటికి 2 గిగావాట్లు, 2029కి 5 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 2029 నాటికి ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయనున్నట్టు డిక్లరేషన్ తెలిపింది. కిలో హైడ్రోజన్ గ్యాస్ రూ.460 నుంచి రూ.160కి తగ్గించేలా పరిశోధనలు, కార్యాచరణ, 2029 నాటికి 25 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ పంపిణీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ కారిడార్గా దీన్ని తీర్చిదిద్దాలని డిక్లరేషన్లో నిర్ణయం తీసుకుంది. ఆవిష్కరణలు, పరిశోధనల కోసం రూ.500 కోట్లు వ్యయం చేస్తామని, గ్రీన్ హైడ్రోజన్ దిశగా కృషి చేసే 50 స్టార్టప్లకు ప్రోత్సాహం కల్పిస్తామని డిక్లరేషన్లో తెలిపింది.