Tirumala: సాధారణ భక్తుడిలా క్యూలైన్లో నిలబడి శ్రీవారిని దర్శించిన సీఎం చంద్రబాబు
తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం (మార్చి 21, 2026) తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
By - అంజి |
Tirumala: సాధారణ భక్తుడిలా క్యూలైన్లో నిలబడి శ్రీవారిని దర్శించిన సీఎం చంద్రబాబు
తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం (మార్చి 21, 2026) తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో 'మహా ద్వార దర్శనం' వంటి వివిఐపి (VVIP) ప్రోటోకాల్ సౌకర్యం ఉన్నప్పటికీ, ఆయన వాటిని పక్కన పెట్టి సాధారణ భక్తులతో కలిసి క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. గతంలో కూడా పలుమార్లు ఆయన ఇదే విధంగా సామాన్య భక్తుడిలా క్యూలైన్లలో వెళ్లి తన నిరాడంబరతను చాటుకున్నారు. అలిపిరి బాంబు పేలుడు ఘటనలో తాను ప్రాణాలతో బయటపడటం భగవంతుడి దయ వల్ల జరిగిన పునర్జన్మగా ఆయన భావిస్తారు. అందుకే తన ఇలవేల్పు అయిన వేంకటేశ్వరుని ముందు అందరూ సమానమేనని భావిస్తూ, సామాన్య భక్తులతో కలిసి దర్శనం చేసుకున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
బ్రహ్మోత్సవాల సమయంలో ప్రభుత్వం తరపున 'పట్టు వస్త్రాలు' సమర్పించే సందర్భాల్లో మినహా, మిగిలిన సమయాల్లో చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి సాధారణ క్యూ పద్ధతిలోనే వెళ్తుంటారు. దీనివల్ల భక్తులకు అందుతున్న వసతులను స్వయంగా పరిశీలించే అవకాశం కూడా కలుగుతుందని ఆయన భావిస్తారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు కుటుంబం తరిగొండ వెంగమాంబ అన్నదాన ట్రస్టుకు ₹44 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు.
దర్శనానంతరం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆలయం నుండి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం వరకు కాలినడకన వెళ్లారు. అక్కడ భక్తులకు స్వయంగా వడ్డించి అన్నదానం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా భక్తుల వద్దకు వెళ్లి స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. ఈ క్రమంలో భక్తులు దేవాన్ష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా, చంద్రబాబు సెక్యూరిటీ ప్రోటోకాల్ను సైతం పక్కన పెట్టి భక్తులతో కరచాలనం చేస్తూ వారిని ఉత్సాహపరిచారు.