మార్పు 100శాతం ఉండాలి.. పాత వాసనలు, వ్యక్తులు కొనసాగకూడదు.. టీటీడీ సమీక్షలో చంద్రబాబు
తిరుమల తిరుపతి దేవస్థానంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమగ్రంగా సమీక్ష చేశారు.
By Knakam Karthik
మార్పు 100శాతం ఉండాలి, పాత వ్యక్తులు కొనసాగకూడదు..టీటీడీపై సమీక్షలో చంద్రబాబు
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే సేవలు, సౌకర్యాల్లో 100 శాతం మార్పు కనిపించాలని, భక్తుల మనోభావాలకు, ఆలయ పవిత్రతకు పెద్దపీట వేసేలా ప్రతి కార్యక్రమం, నిర్ణయం ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమగ్రంగా సమీక్ష చేశారు. భక్తులకు అందించే సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్లో చేపట్టే చర్యలపై సీఎం సమీక్షించారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా సమావేశంలో చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు చేపట్టిన చర్యలు, వాటి ఫలితాలపై అధికారులు నివేదించారు. 9 నెలల కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదంలో తీసుకువచ్చిన మార్పులపై అధికారులు వివరించారు. గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు అవకాశం కల్పించేలా మాఢవీధులలో ఏర్పాట్లు, అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, శ్రీ పద్మావతీ అమ్మవారి దేవాలయం అభివృద్ది ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ది పనులు వంటి అంశాలపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. తిరుమల ప్రతిష్ట పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన, సౌకర్యవంతమైన సేవలకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ “తిరుమల దేవాలయంలో సేవలు బాగుంటే ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుంది. గత ప్రభుత్వానికి నేటికీ ఇప్పటికే మార్పు కనిపించింది. అయితే ఆ మార్పు 100 శాతం ఉండాలి. అప్పుడే భక్తుల, ప్రజల అంచనాలను మనం అందుకోగలం. పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలి. ఏ పనులు అవసరమో ఆ పనులు మాత్రమే చేయాలి. శ్రీవారి డబ్బులు ఇష్టారీతిన ఖర్చు పెట్టవద్దు...మనం దేవాలయానికి ధర్మకర్తలం, నిమిత్తమాత్రులం మాత్రమే. శ్రీవారికి భక్తులు ఇచ్చే కానుకల సొమ్మును ఇష్టారీతిన ఖర్చుపెట్టే అధికారం ఎవరికీ లేదు. ఏడుకొండల వాడి సొమ్ము ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు. వందల కోట్ల నిధులను అనేక కార్యక్రమలకు టీటీడీ ఖర్చు చేస్తోంది.. దీనిపై ఇంటర్నల్ ఆడిటింగ్ తో పాటు....కాగ్ ద్వారా ఆడిట్ జరిపితే మంచిది. భక్తులు ఇచ్చే వితరణ, విరాళాలు ప్రతి రూపాయి సక్రమంగా ఖర్చు అవ్వాల్సిన అవసరం ఉంది. జవాబు దారీతనం ఉండాలి” అని సీఎం స్పష్టం చేశారు.
“టీటీడీలో సమూల ప్రక్షాళన జరుపుతాను అని నేను ఎన్నికల ముందు చెప్పాను. చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన తరువాత అనేక మార్పులు జరిగాయి. అయితే ఈ మార్పులు 100 శాతం ఉండాలి. ఎక్కడా పాతవాసనలు, పాత వ్యక్తులు కొనసాగకూడదు. అనుభవజ్ఞుల పేరుతో పాతవారిని ఇంకా కొనసాగించవద్దు. ప్రక్షాళన అనేది 100 శాతం జరగాల్సిందే...దీనిలో మినహాయింపులు లేవు” అని సీఎం అధికారులకు సూచించారు.