ఏపీ జవాన్ల మృతిపై సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

లడఖ్ లో మరణించిన తెలుగు జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

By Medi Samrat  Published on  1 July 2024 2:15 PM GMT
ఏపీ జవాన్ల మృతిపై సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

లడఖ్ లో మరణించిన తెలుగు జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తెలుగు జవాన్లు సాదరబోయిన నాగరాజు, సుభాన్ ఖాన్, ఎంఆర్కే రెడ్డి మృతి చెందడం బాధాకరమని సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీర జవాన్ల కుటుంబాలని ఆదుకుంటామని భరోసా కల్పించారు. లడఖ్ లో యుద్ధ ట్యాంకుతో నదిని దాటడంలో శిక్షణ పొందుతున్న ఆర్మీ జవాన్లు హఠాత్తుగా వరదరావడంతో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు సైనికులు చనిపోగా, అందులో ముగ్గురు ఏపీకి చెందిన జవాన్లు ఉన్నారు.

ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. లడఖ్ లో జరిగిన ప్రమాదంలో తెలుగు జవాన్లు బాధాకరమని పేర్కొన్నారు. "వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను... వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది" అని నారా లోకేశ్ తెలిపారు.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లడఖ్ లో యుద్ధ ట్యాంకు నదిలో కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివని.. మరణించిన జవాన్లలో కృష్ణా జిల్లాకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకు చెందిన ముత్తుమల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకు చెందిన సుభాన్ ఖాన్ ఉండడం బాధాకరమని అన్నారు. మృతి చెందిన జవాన్ల వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రమాదంలో అసువులు బాసిన తెలుగు జవాన్ల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

Next Story