నిడదవోలులో చంద్రబాబుకు ఘనస్వాగతం

Chandrababu receives a warm welcome in Nidadavolu, to address at a meeting. టీడీపీ చేపట్టిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు,

By అంజి  Published on  2 Dec 2022 8:43 AM GMT
నిడదవోలులో చంద్రబాబుకు ఘనస్వాగతం

టీడీపీ చేపట్టిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిడదవోలు నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ సీనియర్‌ నాయకుడు కుందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. కుందుల స్వగ్రామం తిప్పర్రు నుంచి నిడదవోలు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేత కుందుల సత్యనారాయణ ఐరాలిని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

తిప్పర్రు నుంచి నిడదవోలు వరకు ర్యాలీగా వేలాది బైక్‌లు, కార్లతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. టీడీపీ అధినేత నేడు నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో పర్యటించి రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని వేములూరు, పసివేదల, గౌరిపల్లి, మల్లవరం, చంద్రవరంలో జరిగే పాదయాత్రలో చంద్రబాబు పాల్గొంటారు.

నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్‌లో జరిగే బహిరంగ సభలో నాయుడు పాల్గొంటారు. మధ్యాహ్నం శెట్టిపేట మీదుగా బాబు తాడేపల్లిగూడెం చేరుకుంటారు. నందమూరు, భీమవరం బైపాస్, నవాబుపాలెం, కృష్ణయ్యపాలెంలో చంద్రబాబు రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం తాడేపల్లిగూడెం శేషమహల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత ప్రసంగిస్తారు.

Next Story