వైసీపీ విముక్త ఏపీ కోసం ముందుకెళ్దాం: చంద్రబాబు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ వైసీపీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla
Published on : 14 Jan 2024 10:29 AM IST

chandrababu, pawan kalyan,   bhogi,

 వైసీపీ విముక్త ఏపీ కోసం ముందుకెళ్దాం: చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో 'తెలుగు జాతికి స్వర్ణయగం-సంక్రాంతి సంకల్పం' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు అయ్యారు. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను వారు భోగి మంటల్లో వేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ వైసీపీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇక అమరావతి రైతులు అయితే అడుగడుగునా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందన్న చంద్రబాబు.. రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని ఎవరూ అధైర్యపడొద్దని అన్నారు. 'వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌' కోసం నేటి నుంచి 87 రోజుల పాటు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకే బాటలో పయనిద్దామని పిలుపునిచ్చారు. ఏపీ రాజధాని అమరావతే అనీ..ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేస్తుందని చెప్పారు. సీఎం జగన్‌కు వినాశనం చేయడం తప్ప మంచి చేయడం చేతకాదన్నారు. ఇక రాష్ట్రంలో నెలరోజులకు పైగా అంగన్‌వాడీలు ఆందోళనాలు చేస్తున్నా.. వారి సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు చంద్రబాబు. పండగపూట కూడా వారిని రోడ్డుపై ఉండేలా చేసిన వైసీపీ సర్కార్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఇక రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే బాధ్యత టీడీపీ, జనసేన తీసుకుంటాయని చంద్రబాబు అన్నారు.

అమరావతి రాజధాని కోసం 33వేల ఎకాలు ఇచ్చిన రైతులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. రాజధాని రైతులను వైసీపీ ప్రభుత్వం హయాంలో దారుణంగా కొట్టి వేధించిన ఘటన తనను కలచివేసిందన్నారు. రైతుల సంకల్పం నెరవేరబోతుందని చెప్పారు. బంగారు రాజధానిని నిర్మించుకుందామనీ.. ఇది కేవలం అమరావతి సమస్య కాదు.. రాష్ట్ర ప్రజలందరిది అన్నారు పవన్. నిరుద్యోగులను వైసీపీ సర్కార్ మోసం చేసిందనీ.. వైసీపీ పాలనతో రాష్ట్రానికి పట్టిన పీడ తొలగిపోయే సమయం వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు.

Next Story