జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతాం
CBI court adjourns YS Jagan's bail cancellation petition. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను జూన్ 1 కి వాయిదా వేసింది.
By Medi Samrat Published on 26 May 2021 8:58 AM GMT
అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ పై ఈ రోజు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని జగన్ తో పాటు సీబీఐని గతంలో కోర్టు ఆదేశించింది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను జూన్ 1 కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం ఇస్తూ సీబీఐ కోర్టు విచారణను మరోసారి వేస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ న్యాయస్థానం స్పష్టం చేసింది.
జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలుకు ఇంకోసారి గడువు కోరారు. లాక్డౌన్ కారణంగా జగన్ కౌంటర్ దాఖలు చేయలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. కౌంటర్ను మెయిల్ ద్వారా సమర్పించవచ్చని, ఉద్దేశపూర్వకంగానే ఆయన జాప్యం చేస్తున్నారని రఘురామ న్యాయవాది అన్నారు. కేంద్ర దర్యాప్తు బృందం కూడా కౌంటర్ ఎందుకు వేయట్లేదో అర్థం కావట్లేదని అన్నారు. కౌంటర్ దాఖలు కోసం గడువును పెంచకూడదని, జరిమానా విధించాలని ఈ సందర్భంగా ఆయన కోర్టును కోరారు. దీంతో కౌంటర్ దాఖలుకు జగన్ తో పాటు సీబీఐకి చివరి అవకాశాన్ని ఇస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఒకవేళ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను కోర్టు జూన్ 1కి వాయిదా వేసింది.