ఆంధ్రప్రదేశ్లోని పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తే కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న భేటీ అయిన మంత్రి వర్గం యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్ - ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ పాలసీని అమలు చేయనుంది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానాన్ని రూపొందించింది. 1.63 కోట్ల కుటుంబాలకు హైబ్రిడ్ విధానంలో 3,257 చికిత్సలు అందించనుంది. గతంలో ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో కేవలం 169 వైద్య సేవలే రిజర్వు చేయడం జరిగితే, ఇప్పుడు 324 వైద్య సేవలను అందజేయడం జరుగుతుంది.
ఈ పాలసీ కింద.. ఈహెచ్ఎస్ వర్తించేవారికి కాకుండా మిగతావారికి వైద్యసేవలు వర్తిస్తాయి. జర్నలిస్టుల కుటుంబాలకు వర్తిస్తుంది. తొలుత ఆస్పత్రి ఖర్చులు బీమా కంపెనీలు చెల్లించనుండగా, ఆపై ప్రభుత్వం వాటికి అందిస్తుంది. ఖర్చులను 15 రోజుల్లోగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ఎఫ్పీ విధానంలో రోగి చేరిన 6 గంటల్లో అప్రూవల్ ఇవ్వనున్నారు. ఈ పథకం అమల్లో ఎటు వంటి మోసాలు జరిగినా PMJAY కేంద్ర ప్రభుత్వం యాంటీ ప్రాడ్ ప్రోగ్రామ్ ద్వారా గుర్తించి చర్యలు తీసుకునే విధంగా RFP లో పొందుపర్చడం జరిగింది. ప్రతి పేషంట్ కు ఒక క్యూఆర్ కోడ్ ను ఇచ్చి ఈ పథకం అమలు తీరును ఎప్పటి కప్పుడు పర్యవేక్షించేందుకు ఎన్.టి.ఆర్. ట్రస్టు ఆద్వర్యంలో ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.