అత్య‌ధికంగా రొమ్ము, గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌ల బారిన ప‌డుతున్న ఏపీ మ‌హిళ‌లు

Breast cervical cancers tops list in Andhra state spends Rs 400 crore on free treatment.ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 July 2022 4:42 AM GMT
అత్య‌ధికంగా రొమ్ము, గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌ల బారిన ప‌డుతున్న ఏపీ మ‌హిళ‌లు

ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు చాలా అవసరం. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అది ప్రాణానికే ప్రమాదకరంగా పరిణమించ్చవచ్చు. శరీరంలో ఏదైనా మార్పును గమనిస్తే వెంటనే డాక్టర్ట్‌ను సంప్రదించి ట్రీట్ మెంట్ తీసుకోవాలి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మ‌హిళ‌లు.. రొమ్ము, గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌ల బారిన ఎక్కువ‌గా ప‌డుతున్నారు. ఇక రాష్ట్ర ప్ర‌భుత్వం ఉచిత వైద్యం అందించేందుకు రూ.400 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేస్తోంది.

2021-22లో ఏపీలో మొత్తం న‌మోదైన కార్సినోమా కేసుల్లో దాదాపు 16 శాతం రొమ్ము క్యాన్సర్‌కు సంభందించిన‌వే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్యశ్రీ సేవల నుండి సేకరించిన రోగుల డేటా ప్రకారం.. గర్భాశయ క్యాన్సర్‌లు 14 శాతంతో రెండవ స్థానంలో నిలిచాయి. 6 శాతం మంది రోగులు నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కేవలం ఆరోగ్యశ్రీ పథకం కింద ఆమోదించబడిన క్యాన్సర్ క్లెయిమ్‌లు 2014-15లో దాదాపు రూ. 100 కోట్ల నుండి 2021-22లో రూ. 400 కోట్లకు పెరిగాయి.

ఈ ఖర్చులో 10 శాతానికి పైగా హైదరాబాద్‌లోని ట్రీట్‌మెంట్ సదుపాయాలకే వెచ్చిస్తున్నట్లు డేటా వెల్లడించింది. 2021-22లో మొత్తం కేసుల్లో తూర్పు గోదావరి మరియు గుంటూరు 13% చొప్పున ఉన్నాయి. ఆరోగ్యశ్రీ డేటా ఆధారంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విశాఖపట్నంలోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వరుసగా 5వ, 14వ స్థానంలో నిలిచాయి. మిగిలినవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని కార్పొరేట్ ఆసుపత్రులు.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి జీఎస్ నవీన్ కుమార్ మాట్లాడుతూ పాలియేటివ్ కేర్ మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు ఆరోగ్య శాఖ ముసాయిదా పాలియేటివ్ కేర్ పాలసీని సిద్ధం చేసిందన్నారు. అడ్వాన్స్‌డ్‌ దశలో ఉన్న క్యాన్సర్ రోగులలో ఎక్కువ మందికి పాలియేటివ్ కేర్ అవసరం. పాలియేటివ్ కేర్‌లో రోగులతో పాటు వారి కుటుంబాలకు కూడా ట్రామా మేనేజ్‌మెంట్ ఉంటుంది.

రాష్ట్రంలోని ప్రతి బోధనాసుపత్రిలో ఐదు పడకల పాలియేటివ్ కేర్ సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు ఆరోగ్య మంత్రి వి. రజినీ ఆమోదం తెలిపారు. ఇందుకోసం జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారులను ఆమె కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లలో కేవలం ఆరోగ్యశ్రీ పథకం కింద దాదాపు రూ.1,000 కోట్లు కేన్సర్ కేర్‌కు ఖర్చు చేశారు.

Next Story