అరకు లోయలో రోడ్డు ప్రమాదం, నలుగురు దుర్మరణం

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  9 March 2024 3:45 AM GMT
araku, road accident, four people died, andhra pradesh,

 అరకు లోయలో రోడ్డు ప్రమాదం, నలుగురు దుర్మరణం 

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన మార్చి 8వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అరకు లోయ మండలం నందివలసలో శుక్రవారం రాత్రి జాతర జరిగింది. ఈ జాతరకు వెళ్లి వస్తుండగా రాత్రి 11 గంటల సంయంలో రెండు బైకులను అరకు లోయ నుంచి వెళ్తున్న మరో బైక్‌ ఢీకొట్టింది. దాంతో.. ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనాస్థలిలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో చినలబుడు ప్రాంతానికి చెందిన బురిడీ హరి (17), గొల్లూరి అమ్మనాకాంత్ (13), లోతేరు ప్రాంతానికి చెందిన త్రినాథ్ (32)తో పాటు నాలుగేళ్ల బాలుడు భార్గవ్‌గా పోలీసులు గుర్తించారు.

ఇక ఇదే ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. శివరాత్రి వేళ జాతర జరుగుతున్న సందర్భంలో రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోవడే కాక.. ఐదుగురు గాయపడటం స్థానికంగా విషాదాన్ని నింపింది.

Next Story