అమరావతి: నైరుతి రుతు పవనాలు తాకినా రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 39- 40°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అటు మన్యం, అల్లూరి, కాకినాడ జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని ప్రాంతాల్లో నిన్నటి నుంచే ఉష్ణోగ్రతలు పెరిగాయి. నిన్న పల్నాడులోని జంగమేశ్వరపురంలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రానున్న రెండు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.