Andhrapradesh: ఎంఆర్ఐ స్కాన్ చేస్తుండగా.. మిషన్‌లోనే గిలగిల్లాడుతూ మహిళ మృతి

మంగళవారం ఏలూరులోని ఓ డయాగ్నస్టిక్ లాబొరేటరీలో ఎంఆర్‌ఐ స్కాన్ తీసుకుంటూ అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ మరణించింది.

By అంజి  Published on  5 Feb 2025 8:21 AM IST
AP woman died, MRI scan, husband blames technician, APnews

Andhrapradesh: ఎంఆర్ఐ స్కాన్ చేస్తుండగా.. మిషన్‌లోనే గిలగిల్లాడుతూ మహిళ మృతి

మంగళవారం ఏలూరులోని ఓ డయాగ్నస్టిక్ లాబొరేటరీలో ఎంఆర్‌ఐ స్కాన్ తీసుకుంటూ అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ మరణించింది. బాధితురాలు ఏలూరు జిల్లా ఏలూరు గ్రామీణ మండలం ప్రతికొల్లంక గ్రామానికి చెందిన రామ తులసి. ఆమెకు గతంలో పేస్‌మేకర్‌ అమర్చారు. అయితే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆమెకు రెండు నెలల నుంచి ఓ ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయిస్తున్నారు. తనకు పేస్‌మేకర్‌ అమర్చిన విషయాన్ని అక్కడి డాక్టర్లకు చెప్పారు. తలనొప్పిగా ఉందని చెప్పడంతో డాక్టర్లు డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో ఎంఆర్‌ఐ స్కాన్‌ తీయించుకురావాలని సూచించారు. ఈ క్రమంలోనే ఆమెను ఆమె భర్త కోటేశ్వరరావు డయాగ్నస్టిక్ లాబొరేటరీకి తీసుకెళ్లారు.

"MRI స్కానింగ్ చేసినప్పుడు, సాధారణంగా ల్యాబ్ టెక్నీషియన్ రోగుల శరీరంపై ఉన్న ఏదైనా లోహాలు ఉంటే తొలగించాలని చెబుతాడు. ఈ సందర్భంలో, ఆభరణాలను తొలగించాలా వద్దా అని నేను టెక్నీషియన్లను అడిగినప్పటికీ, వారు నా మాటలను పట్టించుకోలేదు'' అని కోటేశ్వరరావు చెప్పారు." MRI స్కానింగ్ సమయంలో ఆమె కాళ్లు కొట్టుకుంటూ విలవిల్లాడింది. భర్త కళ్లెదుటే ఆమె ఇబ్బందికి గురై మరణించింది. దీని తరువాత, భర్త డయాగ్నసిస్ సెంటర్ వద్ద నిరసనకు దిగాడు. న్యాయం జరిగేలా చూడాలని, ల్యాబ్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, పోలీసులను ఆయన అభ్యర్థించారు. ఏలూరు టూటౌన్‌ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story