ఏ రాష్ట్రానికి అయినా రాజధాని అవసరం, ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని.. రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ అన్నారు. రూ.43 వేల కోట్లకు గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచాం. అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా సర్వీస్ భవనాలు దాదాపు పూర్తయ్యాయి. కానీ గత ప్రభుత్వం ఇదేమీ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అనేక ఇబ్బందులు వచ్చాయి. ఐఐటీ మద్రాస్ను పిలిచి బిల్డింగ్ నాణ్యత పరిశీలించి, కాంట్రాక్టర్లతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించాం..అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
90 శాతం పనులు టెండర్లు పూర్తి అయ్యాయి. మొదట క్లీనింగ్తో పనులు మొదలయ్యాయి. మొత్తం 186 బంగ్లాలు మంత్రులు , జడ్జిలు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శకులకు వస్తున్నాయి. గెజిటెడ్ అధికారులకు 1440, ఎన్జీవోలకు 1995 నిర్మాణాలు వస్తున్నాయి. హైకోర్టుకు 16.85 లక్షల చదరపు అడుగులు వస్తుంది. అసెంబ్లీ 250 మీటర్ల ఎత్తులో వస్తుంది. 15 రోజుల్లో కాంట్రాక్టర్ల మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలపై ఒక పైసా భారం లేకుండా రాజధాని నిర్మాణం పూర్తి అవుతుంది. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి రుణాలు తీసుకున్నాం. ల్యాండ్ వ్యాల్యూ పెరిగిన తర్వాత.. అప్పు తీర్చడం జరుగుతుంది. ప్రజల డబ్బును వ్యర్థం చేస్తున్నారన్న ప్రతిపక్షం అంటోంది...అది సరి కాదు..అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.