పంచాయతీ ఎన్నికలు.. హైకోర్టును ఆశ్రయించిన 18 ఏళ్లు దాటిన ఓ విద్యార్థిని

AP Local Body Elections 2021. ఆంధ్రప్రదేశ్ లో 18 ఏళ్లు దాటిన ఓ విద్యార్థిని ఏపీ ఎన్నిక‌లు ఆపాల్సిందే అంటూ కొత్త‌గా పిటిష‌న్ వేయడం విశేషం.

By Medi Samrat  Published on  24 Jan 2021 11:50 AM GMT
AP Local Body Elections 2021

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలపై ఓ క్లారిటీ లేకుండా పోతోంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోకుండా ఎన్నికల విధులకు హాజరు కాలేమని ఉద్యోగసంఘాలు చెబుతూ ఉన్నాయి. ఓ వైపు ప్రభుత్వానికి, ఎస్ఈసీకి పంచాయతీ ఎన్నికల విషయంలో రచ్చ జరుగుతూ ఉన్న సమయంలో 18 ఏళ్లు దాటిన ఓ విద్యార్థిని ఏపీ ఎన్నిక‌లు ఆపాల్సిందే అంటూ కొత్త‌గా పిటిష‌న్ వేయడం విశేషం. గుంటూరుకు చెందిన ఓ విద్యార్థిని ఏపీ ఎన్నిక‌లు ఆపాల‌ని డిమాండ్ చేస్తోంది.

నాకు 18 ఏళ్లు నిండాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్ర‌కారం.. 18 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రికీ ఓటు హ‌క్కు ఉంటుంది. నాకు కూడా ఓటు హ‌క్కు ఉంది. నా ఓటు హ‌క్కుని నేను వినియోగించ‌కుండా పంచాయితీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. మా ఊళ్లో ప్రెసిడెంట్ ఎవ‌రు ఉండాలో అనే విష‌యం డిసైడ్ చేయ‌డంలో నాకూ భాగ‌స్వామ్యం కావాలి. నాకూ ఓటు హ‌క్కు వినియోగించుకునే అవ‌కాశం ఉండాలి అంటూ కోర్టును ఆశ్రయించింది సదరు విద్యార్థిని. 2019 లెక్క‌ల ప్ర‌కారం, అప్ప‌టి ఓట్ల లిస్ట్ ప్ర‌కారం ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే నాతో పాటు.. మొత్తం 3 ల‌క్ష‌ల 60 వేల మంది ఓటు వినియోగించుకునే హ‌క్కు కోల్పోతార‌ని మా అంద‌రికీ ఓటు హ‌క్కు వినియోగించుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని హౌజ్ మోష‌న్ పిటిష‌న్ లో కోరింది విద్యార్థిని. ఎస్ఈసీ రిలీజ్ చేసిన నోటిఫికేష‌న్ ను ర‌ద్దు చేయాలని 2019 లెక్క‌ల ప్ర‌కారం కాకుండా కొత్త ఓట‌ర్ల లిస్ట్ త‌యారు చేసి ఈ 3 ల‌క్ష‌ల 60 వేల మందికి కూడా ఓటు వేసే అవ‌కాశం క‌ల్పించాల‌ని ఆమె కోరింది. ఆ తర్వాతనే ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని కోరింది. మ‌రి విద్యార్థిన కోరిక‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.


Next Story