ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ సస్పెన్షన్ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన సస్పెన్షన్ను జూన్ 30, 2026 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సునీల్ కుమార్ సస్పెన్షన్ గడువు ఈ ఏడాది జూన్ 30తో ముగియనుండగా, ఆయనపై ఉన్న క్రిమినల్ కేసు విచారణ పూర్తికావడం లేదా ఆయన పదవీ విరమణ (రిటైర్మెంట్) చేయడం.. వీటిలో ఏది ముందైతే అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గత ప్రభుత్వ హయాంలో ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో వేధించారనే ఆరోపణలపై సునీల్ కుమార్పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది. అగ్రిగోల్డ్ కేసు దర్యాప్తు సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలు కూడా ఆయనపై ఉన్నాయి. ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండానే విదేశీ పర్యటనలకు వెళ్లడం వంటి సర్వీస్ నిబంధనల ఉల్లంఘనలపై కూడా ప్రభుత్వం సీరియస్గా ఉంది. గత ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన అధికారిగా వెలుగొందిన సునీల్ కుమార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస విచారణలు మరియు సస్పెన్షన్లను ఎదుర్కొంటున్నారు.