భవన నిర్మాణదారులకు ఏపీ సర్కార్ భారీ గుడ్న్యూస్
రాష్ట్ర ప్రభుత్వం బిల్డర్ల కోసం ఒక ముఖ్యమైన డెవలప్మెంట్ని ప్రకటించిందని మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి మంత్రి పి. నారాయణ అన్నారు.
By అంజి Published on 4 March 2025 7:58 AM IST
భవన నిర్మాణదారులకు ఏపీ సర్కార్ భారీ గుడ్న్యూస్
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం బిల్డర్ల కోసం ఒక ముఖ్యమైన డెవలప్మెంట్ని ప్రకటించిందని మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి మంత్రి పి. నారాయణ అన్నారు. తాజాగా భవన నిర్మాణదారుల కోసం అందుబాటులోకి వచ్చిన కొత్త సాఫ్ట్ వేర్ తీసుకొచ్చినట్టు ప్రకటించారు. 18 మీటర్ల ఎత్తు లేదా ఐదు అంతస్తుల ఎత్తు ఉన్న భవనాలు పట్టణ ప్రణాళిక అధికారుల ఆమోదం అవసరం లేకుండా స్వీయ ధృవీకరణ ద్వారా నిర్మాణ అనుమతులను పొందవచ్చని ఆయన వివరించారు. అయితే, భవన యజమానులు అవసరమైన స్వీయ-ధృవీకరణ (అఫిడవిట్) అందించడానికి రిజిస్టర్డ్ స్థానిక టౌన్ ప్లానర్లు, ఇంజనీర్లు లేదా ఆర్కిటెక్ట్ల సమక్షంలో సరైన డాక్యుమెంటేషన్ను సమర్పించాలని ఆయన వివరించారు.
నిర్మాణ అనుమతుల కోసం కొత్త ప్రక్రియను ప్రవేశపెడుతూ ప్రభుత్వం గత నెలలో జీవో జారీ చేసినప్పటికీ, సాంకేతిక సమస్యల వల్ల జాప్యం జరిగిందని మంత్రి అన్నారు. భవన నిర్మాణ అనుమతుల జారీని వేగవంతం చేయడమే ఈ కొత్త విధానం లక్ష్యమని తెలిపారు. స్వీయ ధృవీకరణ ద్వారా అనుమతులు మంజూరు చేయడానికి అవసరమైన సాఫ్ట్వేర్ను APDPMS పోర్టల్లో అందుబాటులో ఉంచినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అయితే భవన నిర్మాణాలను కొనసాగించడానికి కార్పొరేషన్ల పరిధిలో మార్టగేజ్ చేయాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే తనఖా పెట్టిన భాగాలను జప్తు చేయడంతో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ విడుదల కాదు. ఈ కొత్త వ్యవస్థ ఆమోదించబడిన లేఅవుట్లు, గ్రామ లేఅవుట్లు, సర్క్యులేషన్ ప్లాన్లు, 1985 కి ముందు నిర్మించిన భవనాల పునర్నిర్మాణానికి ప్రయోజనం చేకూరుస్తుందని మంత్రి నారాయణ తెలిపారు.