ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సాగు సీజన్ ప్రారంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా దరఖాస్తులన్నింటికీ అనుమతులు ఇచ్చి, మరో రెండు నెలల్లోగా కనెక్షన్ల ప్రక్రియను పూర్తి చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కంలను) ప్రభుత్వం ఆదేశించింది.
ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 250 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా 10,000 కొత్త ట్రాన్స్ఫార్మర్లను కేటాయించనున్నారు. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, పెండింగ్ కనెక్షన్లన్నీ త్వరితగతిన ఆన్లైన్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 22.30 లక్షల కనెక్షన్లు ఉండగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 1.12 లక్షల కనెక్షన్లను మంజూరు చేసింది. తాజా నిర్ణయంతో మరో 46 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.