అమరావతి: రాష్ట్రంలోని మద్యం ప్రియులకు త్వరలో ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్టు తెలుస్తోంది. వైన్ షాపుల వద్ద పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. దీనిపై ఓ అధ్యయన కమిటీ వేయాలని సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. కమిటీ రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని వారికి సూచించారు. లిక్కర్ షాపుల వద్ద ఆన్లైన్ కొనుగోళ్లను ప్రోత్సహించాలన్నారు. ప్రజల ఆరోగ్యం దెబ్బతినకుండా నాణ్యతతో కూడిన మద్యం విధానాన్ని అమలు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
కొత్త మద్యం పాలసీతో అక్రమాలకు చెక్ పడిందని, ప్రభుత్వ ఆదాయం పెరిగిందని చెప్పారు. నేషనల్, ఇంటర్నెషనల్ బ్రాండ్లు, క్వాలిటీ ఉన్న మద్యం విక్రయాలు మాత్రమే రాష్ట్రంలో జరగాలన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటు విక్రయాలు జరగకూడదని చెప్పారు.. గత పాలసీతో పోలిస్తే కనీసం రూ.10 నుంచి రూ.100 వరకు ధరలు తగ్గినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే ఏపీలో విక్రయిస్తున్న 30 బ్రాండ్లపై మద్యం ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. అటు పర్మిట్ రూమ్లకు పర్మిషన్ ఇచ్చే అంశంపై కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.